వివరాలు మాత్రమే తీసుకున్నారు: డీసీపీ

శంషాబాద్‌‌: దిశ ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్‌ స్థలాన్ని ఏడుగురు సభ్యులతో కూడిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ బృందం పరిశీలించిందని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రిలో మార్చురీలో ఉన్న నలుగురు నిందితుల మృతదేహాలను పరిశీలించిందని పేర్కొన్నారు. అనంతరం నలుగురు నిందింతులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఎన్‌హెచ్‌ఆర్సీ బృందానికి  సీనియర్ ఎస్పీ నేతృత్వం వహిస్తున్నారని ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ బృందంలో ఫోరెన్సిక్ నిపుణుడు కూడా ఉన్నారని తెలిపారు. ఘటనకు సంబంధించి వారు తమ దగ్గర వివరాలు మాత్రమే తీసుకున్నారని వెల్లడించారు. వారు మీడియాతో మాట్లాడే వీలు లేనందున వాళ్ల తరఫున తనను మాట్లాడమన్నారని పేర్కొన్నారు.










ఇదిలా ఉండగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణాధికారిగా రాచకొండ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డి నియమితులయ్యారు. చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఆయన దర్యాప్తు జరుపనున్నారు. కాగా షాద్‌నగర్‌ సమీపంలో గత నెల 27న వెటర్నరీ వైద్యురాలిపై మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు నవీన్‌, జొల్లు శివ, చెన్నకేశవులు అత్యాచారం చేసి, అనంతరం ఆమెపై పెట్రోలు పోసి తగులబెట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం.. క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా వారు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో కాల్చి చంపిన విషయం తెలిసిందే.