రోబోలతో రోగులకు ఆహారం, మందులు

ముంబై కోవిడ్‌-19 రోగులకు సేవలందించేందుకు ఐఐటీ గౌహతికి చెందిన పరిశోధకులు రెండు రోబోలను అభివృద్ధి చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ రోగులకు ఆహారం, మందులు అందించడం, వ్యర్థాలను సేకరించడం వంటి పనులను ఈ రోబోలు చేపడతాయి. ఐసోలేషన్‌ వార్డుల్లో వైద్య సిబ్బందికి వైరస్‌ ముప్పును తగ్గించేందుకు రోబోలు ఉపకరిస్తాయని ఐఐటీ గౌహతికి చెందిన మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ర్టిక్‌ ఇంజనీరింగ్‌ విభాగాలు యోచిస్తున్నాయి. ఆస్పత్రి అవసరాలకు తగిన విధంగా కరోనా రోగులకు ఆహారం, మందులు అందించే రోబోతో పాటు ఐసోలేషన్‌ వార్డుల్లో వైరస్‌ వ్యాప్తి చెందే రిస్క్‌ పొంచి ఉన్న వ్యర్థాల సేకరణ కోసం మరో రోబోను అభివృద్ధి చేయడంపై కసరత్తు చేస్తున్నామని గౌహతి ఐఐటీ టీం ప్రతినిధులు వెల్లడించారు.